చిరంజీవి, జెనీలియా సహా సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  • గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి సమావేశం
  • భేటీలో పాల్గొన్న చిరంజీవి, జెనీలియా, అమల, అల్లు అరవింద్, దిల్ రాజు
  • స్క్రిప్ట్‌తో వచ్చి సినిమాలు పూర్తి చేసుకుని వెళ్లాలని వ్యాఖ్య
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు చిరంజీవి, జెనీలియా, అమల, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, పలువురు తెలుగు, హిందీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సెషన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. స్క్రిప్ట్‌తో వచ్చి సినిమాలు పూర్తి చేసుకొని వెళ్లండి అని వారికి సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోల ఏర్పాటుకు సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. 24 క్రాఫ్ట్స్‌లో సినిమా పరిశ్రమ అవకాశాలకు అనుగుణంగా స్థానికులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి సూచించారు. కాగా, అంతకుముందు సినీ నటుడు చిరంజీవి ఆయనను కలిశారు.

Revanth Reddy
Chiranjeevi
Genelia
Telangana Rising Global Summit 2025
Telugu cinema

More Telugu News